తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ధర్తీ అభా జన్ భాగీదారి ప్రచారంలో భాగంగా భారీ సికిల్ సెల్ స్క్రీనింగ్... 15055 గిరిజన విద్యార్థులకు పరీక్షలు – 429 క్యారియర్లు, 47 రోగులు గుర్తింపు.. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ నేతృత్వంలో విజయవంతంగా క్యాంపుల నిర్వహణ.. జిల్లాలో ధర్తీ అభా జన్ భాగీదారి ప్రచారంలో భాగంగా, గడచిన వారం రోజులుగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సికిల్ సెల్ స్క్రీనింగ్ డ్రైవ్ నిర్వహించబడింది అని జిల్లా వైద్యశాఖ అధికారి జయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో 15,055 మంది ఆశ్రమ, గిరిజన సంక్షేమ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సంతృప్తికరంగా ఫలితాలను అందించాయన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కలెక్టర్ జితేష్ వి. పాటిల్, పిఒ ఐటిడిఎ, ఎన్సిడి ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ మధువరన్ మార్గదర్శకత్వంలో నిర్వహించబడింది అని తెలిపారు . అన్ని పిహెచ్సీలు, యుపిహెచ్సీల ఎంఓలు, క్షేత్రస్థాయి వైద్య బృందాలు ఈ సర్వేలో భాగస్వాములై అహర్నిశలు శ్రమించారు అన్నారు. ఈ పరీక్షల ద్వారా 429 మంది క్యారియర్లు, 47 మంది సికిల్ సెల్ రోగులను గుర్తించగా, వారికి తగిన కౌన్సెలింగ్ మరియు వైద్యసహాయం అందించనున్నారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా సికిల్ సెల్ ఐడి రిజిస్టర్ నిర్వహించేందుకు హెడ్మాస్టర్లకు సూచనలు చేశారు. ఆరోగ్య శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖల మధ్య సమన్వయం వల్ల ఈ కార్యక్రమం విజయవంతమైందని ఆమె తెలిపారు . రాబోయే వారం నుండి ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులను కూడా ఇదే నమూనాలో పరీక్షించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే సికిల్ సెల్ వ్యాధి నిర్మూలనలో ఇలాంటి క్యాంపుల నిర్వహణ ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ