తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూపోరాటాల యోధుడు నల్లమల గిరిప్రసాద్. పేదల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధీశాలి. నేటి తరం కమ్యూనిస్టులకు ఆయన జీవితం ఒక దిక్సూచి. గిరిప్రసాద్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా.సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. భూపోరాటాల యోధుడు నల్లమల గిరిప్రసాద్ అని, ఆయన ఆశయాలను సాధించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సిపిఐ మాజీ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు నల్లమల గిరిప్రసాద్ 29వ వర్ధంతిని ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో గిరిప్రసాద్ పోషించిన పాత్ర అజరామరమైనదన్నారు. తన ఉన్నత విద్యను, ఆస్తులను వదిలి సమాజ శ్రేయస్సు కోసం, పేద ప్రజల భూమి హక్కుల కోసం లక్షలాది ఎకరాలను పంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తూ ఎనలేని అభివృద్ధిని సాధించారని, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచిన ధీశాలి అని కొనియాడారు. పోలీసుల కాల్పుల్లో అయన ఒంటిపై పడిన మచ్చ మినహా ఎలాంటి మచ్చ లేని కమ్యూనిస్టు నొదుదని కొనియాడారు. ప్రస్తుత తరం కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా సమితి సభ్యులు భూక్యా శ్రీనివాస్, నేరెళ్ల రమేష్, నాయకులు మాతంగి లింగయ్య, పి సత్యనారాయణ చారి, షాహీన్, కైసర్, జలీల్, మిర్యాల రాము, చోటు షరీఫ్, బాజోజు రవి, సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ