తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టెట్ పరీక్షలు అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కీలకమైన పరీక్షలు కావడంతో ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో టెట్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్, అధనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యచందన,సంబంధిత శాఖల అధికారులతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనవరి 2026లో 4, 5, 6, 8, 9, 11, 19, 20 తేదీలలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9.00 గంటల నుండి 11.30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో టెట్ పరీక్షలకు మొత్తం 1017 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని కలెక్టర్ వెల్లడించారు. టెట్ పరీక్షల నిర్వహణ నిమిత్తం జిల్లా వ్యాప్తంగా రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సుజాతనగర్ మండలం అబ్దుల్ కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్, పాల్వంచ మండలం అనుబోస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ముగ్గురు అబ్జర్వర్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నిరంతర పర్యవేక్షణ చేపట్టే విధంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. పరీక్షలు పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని కంప్యూటర్లు, నెట్వర్క్ కనెక్టివిటీ సక్రమంగా పనిచేసేలా ముందుగానే పరిశీలించాలని, సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఐటీ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. జనవరి 3వ తేదీన మాక్ టెస్ట్ను అబ్జర్వర్ల పర్యవేక్షణలో నిర్వహించి, అన్ని కంప్యూటర్లు సరిగా పనిచేస్తున్నాయా లేదా ధృవీకరించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ నిశితంగా పరిశీలించిన అనంతరమే అనుమతించాలని తెలిపారు. అభ్యర్థులు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తమ వెంట తీసుకురావాలని, గుర్తింపు కార్డు పరిశీలించిన తరువాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు. అభ్యర్థులకు పరీక్షా హాల్ వివరాలు సులభంగా తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, శౌచాలయాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. దివ్యాంగ అభ్యర్థులకు అవసరమైన సహాయకులను నియమించాలని సూచించారు. పరీక్షల సమయంలో మెడికల్ క్యాంపులు సిద్ధం చేసి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలని సంబంధిత అధికారులను సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, ముందుగానే జనరేటర్లు, ఇన్వర్టర్లు అందుబాటులో ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంటన్నర ముందే చేరుకోవాలని, పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందే గేట్లు మూసివేయాలని తెలిపారు. ఒకసారి గేట్లు మూసిన తరువాత ఎవరికీ లోపలికి అనుమతి ఉండదని, అలాగే పరీక్ష సమయం పూర్తయ్యే వరకు ఎవరినీ బయటకు అనుమతించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇన్విజిలేటర్లు పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేదా లోపాలు తలెత్తితే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెట్ పరీక్షలు ప్రశాంతంగా, న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించే దిశగా అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్ అనుబోస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్, అబ్దుల్ కలాం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దయాకర్ రావు, అబ్జర్వర్లు, పోలీస్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ