తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనైన కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలను 21000/-లకు తగ్గకుండా నిర్ణయించాలని ఏఐటీయుసి నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నాడు సింగరేణి కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ - AITUC కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య,ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కిష్టాఫర్ లు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటుతున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచకపోవడం వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారని,ఈ బడ్జెట్ సమావేశాల్లో నైనా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 21000/-లకు తగ్గకుండా చెల్లించేట్లుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.ఈనెల 7వ తేదీన హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన స్ట్రక్చరల్ సమావేశాల్లో గుర్తింపు కార్మిక సంఘం-AITUC నాయకులు మరియు గౌరవాధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు గారు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచి తక్షణమే అమలు చేయాలని,కాళీ క్వార్టర్స్ ను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలని,సింగరేణి లో అమలు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల గైర్ హజరు పై పెనాల్టీ విధానాన్ని రద్దు పరచాలని,ESI ను అమలు చేయాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్లుగా నాయకులు తెలిపారు.కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలకు ఒకవైపున ప్రభుత్వంపై మరియు యాజమాన్యంపై పోరాడుతూనే మరోవైపున చర్చల ద్వారా గుర్తింపు కార్మిక సంఘం తరఫున ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు దేని ఆధారంగా వేతనాల పెంచడానికి అవకాశాలు ఉన్నాయో,మెరుగైన వేతనాలు చెల్లించడానికి పరిష్కారం కై ఏఐటియుసి ప్రయత్నం చేస్తుందని తెలిపారు.18 రోజుల సమ్మె సందర్భంగా ఒప్పందంలోని పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవడానికి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యేకమైన వేతనాలను సాధించుకోవడానికి కాంట్రాక్ట్ కార్మికులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎం చంద్రశేఖర్,సిహెచ్ శ్రీను,గోపి,సురేష్,కళావతి, పద్మ,లక్ష్మి,ఆదిలక్ష్మి పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ