తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 360 జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్-II) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోళ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి భూక్యా కృష్ణమూర్తి, మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వాంకుడోత్ శివ సింగరేణి సీఎండీకి వినతిపత్రం సమర్పించారు. సంఘం తెలిపిన వివరాల ప్రకారం, సింగరేణి (SCCL) మార్చి 23, 2024న సర్క్యులర్ నం: CRP/PER/R/2024/1371 ద్వారా 360 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, జనవరి 10, 2025న సర్క్యులర్ నం: CRP/PER/R/2025/32 ద్వారా ఈ నోటిఫికేషన్ రద్దు చేసి, తిరిగి కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదే నోటిఫికేషన్లో పేర్కొన్న ఇతర పోస్టులు ఇప్పటికే భర్తీ చేయబడ్డాయి. కానీ, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ మాత్రం నిలిచిపోయింది. ఈ పోస్టుల భర్తీ త్వరగా చేపట్టడం వల్ల కొత్తగా చేరిన అర్హులైన గిరిజన ఉద్యోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని సంఘం నాయకులు తెలిపారు. గిరిజన అభ్యర్థులు ఓపెన్ కాంపిటీషన్ తో పాటు 10 శాతం రిజర్వేషన్ కోటా ద్వారా కూడా పెద్ద సంఖ్యలో ఈ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఈ నియామక ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు కోరారు. సీఎండీని కలిసిన వారిలో మందమర్రికి చెందిన శ్రీ సుమన్ (అండర్ మేనేజర్) మరియు భూపాలపల్లికి చెందిన ధరావత్ రమేష్ ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ