తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భాగ్యరెడ్డి వర్మ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ దళితుల హక్కుల సాధన, అణగారిన వర్గాల సంక్షేమం కోసం జీవితాంతం పోరాటం చేశారని తెలిపారు. బాల్య వివాహాలు, అంటరానితనం, దేవదాసి, జోగిని వంటి సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.దళిత ఉద్యమ పితామహుడిగా, సంఘసంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని జిల్లా కలెక్టర్ అన్నారు. దళితులలో చైతన్యం తీసుకురావడానికి ఆయన అహర్నిశలు శ్రమించారని తెలిపారు. మహనీయుల చరిత్ర, ఆశయాలు, త్యాగాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు . దేశ భవిష్యత్తు, ప్రజల సంక్షేమం కోసం మహనీయులు చూపిన మార్గాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు సిబ్బంది సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ