తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బూర్గంపాడులో గురుకుల పాఠశాల, ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ బూర్గంపాడు మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని తెలంగాణ అల్పసంఖ్యాక గురుకుల పాఠశాలతో పాటు మొరంపల్లి బంజర గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఫెర్టిలైజర్ దుకాణాన్ని సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ఆహార నాణ్యత, రైతులకు ఎరువుల లభ్యత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదట తెలంగాణ అల్పసంఖ్యాక గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పాఠశాలలోని కిచెన్ షెడ్, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి గృహాలను పరిశీలించారు. కిచెన్ షెడ్లో వంటల తయారీ విధానాన్ని పరిశీలించి విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. వంటశాల, భోజనశాల పరిసరాల్లో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మెనూ చార్ట్ను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారమే ఆహారం అందుతున్నదా లేదా అని ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెనూ అమలులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని సూచించారు. అనంతరం స్టోర్ రూమ్ను పరిశీలించి నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులు, కూరగాయల నాణ్యతను తనిఖీ చేశారు. ఎప్పటికప్పుడు తాజా కూరగాయలను మాత్రమే వంటకు వినియోగించాలని, ఆహార పదార్థాల నిల్వ, వినియోగంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ పాఠశాలలో అందుతున్న విద్య, వసతి, భోజనం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరికలు, హాజరు శాతం, బోధనా కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం మొరంపల్లి బంజర గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఫెర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తగినంతగా అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. దుకాణంలోని పత్తి విత్తనాల ప్యాకెట్లు, వివిధ రకాల ఎరువులు, పురుగుల మందుల నిల్వలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి నిల్వలు, విక్రయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గోదాములో నిల్వ ఉంచిన యూరియా బస్తాలను పరిశీలించి నిల్వల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని డీలర్లకు సూచించారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఇన్పుట్లు అందించడంలో నిర్లక్ష్యం ఉండరాదన్నారు. స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నిల్వలు, విక్రయాల వివరాలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగితే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కలెక్టర్ వెంట బూర్గంపాడు తాసిల్దార్ కె.ఆర్.కె.వి ప్రసాద్,డిప్యూటీ తాసిల్దార్ సమ్మయ్య, ఎంపీడీవో జమ్మల రెడ్డి, ఎంపీవో, కళాశాల ప్రిన్సిపాల్ నాగజ్యోతి, వ్యవసాయ శాఖ అధికారి ఏవో శంకర్, హౌసింగ్ ఏడి, జి పి ఓ లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ