తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలు, చెక్పోస్టులు, పంపిణీ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జిల్లా సాధారణ పరిశీలకులు వి. సర్వేశ్వర రెడ్డి మంగళవారం విస్తృత పర్యటన చేపట్టారు. ఎన్నికల విధానాలు, సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మొదటగా పరిశీలకులు బూర్గంపహాడ్ మండలంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సందర్శించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఎన్నికల సామగ్రి, టోకెన్లు, బ్యాలెట్ బాక్సులు మరియు ఇతర వనరుల పంపిణీపై అక్కడి అధికారులు ఇచ్చిన వివరాలను ఆయన పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు సమయపాలనతో, శాస్త్రీయంగా, గందరగోళం లేకుండా చేపట్టాలని సూచించారు. మోరంపల్లి బంజార జడ్పీహెచ్ఎస్, పినపాకపట్టినగర్ జడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, లైటింగ్ సౌకర్యాలను పరిశీలించి, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని సంబంధిత ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు. ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు వినియోగదాయకమైన విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాల సమన్వయం కూడా పకడ్బందీగా ఉండాలని చెప్పారు. అనంతరం పరిశీలకులు మోరంపల్లి బంజార, అలాగే యెల్లందు క్రాస్ రోడ్ – కొత్తగూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను సందర్శించారు. చెక్పోస్ట్లలో డ్యూటీలో ఉన్న అధికారులతో మాట్లాడి, ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణా, డబ్బు పంపిణీ, మద్యం రవాణా వంటి నిబంధనలకు విరుద్ధమైన చర్యలను కట్టడి చేయడానికి ప్రతి వాహనాన్ని కచ్చితంగా మరియు పారదర్శకంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఏ వాహనం కూడా తనిఖీ లేకుండా పంపితే బాధ్యత సంబంధిత అధికారులదే అవుతుందని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సంబంధిత మండల అధికారులతో పాటు పోలీస్ విభాగం, రెవెన్యూ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ