తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : శుక్రవారం నాడు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము నందు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు 2025 గోడపత్రికలను జిల్లా అదనపు కలెక్టర్ సౌరభ్ శర్మ ఆవిష్కరించారు . ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ సౌరభ్ శర్మ మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అని, ఈ సందర్భంగా జిల్లాలోని 11 ప్రాజెక్టుల పరిధిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాధాన్యతపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు, తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని పుట్టిన ప్రతి బిడ్డకు మొదటి గంటలోపు తప్పనిసరిగా తల్లిపాలు పట్టాలని, అలాగే బిడ్డకు మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం అని, దీనిని ప్రతి తల్లి పాటిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించే విధంగా కార్యచరణ రూపొందించుకోవాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వారోత్సవాలలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బంది, ఆశాలు, స్వయం సహాయక సంఘాలు, ఎన్జీవోలు, డి ఆర్ డి ఏ, లైన్ డిపార్ట్మెంట్లు సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ సౌరభ్ శర్మ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ని ఆవిష్కరించి వారం రోజుల షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఏ రోజు ఏం చేయనున్నారు దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 1న ప్రతి అంగనవాడి కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఇందులో తల్లులకు తల్లిపాల ప్రాధాన్యతను వివరిస్తారు, రెండవ తేదీన ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాధాన్యతను తల్లులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు, నాలుగో తేదీన అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి అంగనవాడి టీచర్స్, ఆశా వర్కర్లు బ్రెస్ట్ ఫీడింగ్ పై అవగాహన కల్పిస్తారు. ఐదో తేదీన ఇంటింటికి వెళ్లి తల్లిపాల ప్రాధాన్యతపై ప్రచారం చేస్తారు, 6న చేతులను శుభ్రం చేసుకునే అంశంపై అవగాహన కల్పిస్తారు. ఏడోవ తేదిన స్వయం సహాయక సంఘాల సభ్యులు, మెప్మా, సెర్ఫ్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, బ్రెస్ట్ ఫీడింగ్ పై విస్తృత అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయలక్ష్మి, సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ పి.సంపత్, సూపర్వైజర్ రమా దేవి పోషణ అభియాన్ జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్ బి. రాము, బ్లాక్ కోఆర్డినేటర్ సోనీ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ