తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ) డైరెక్టర్ శ్రీరామ్ తరణికాంతి, ఐఏఎస్ తెలిపారు. సోమవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయనను ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మొక్కను అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీరామ్ తరణికాంతి మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారుల నుండి సమగ్రంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా మొత్తం జనాభా, జననాల రేటు, ప్రజల సగటు జీవనకాలం, వ్యవసాయ భూముల విస్తీర్ణం, రహదారుల పొడవు, అటవీ ప్రాంతాల శాతం, సాగునీటి వనరులు, అంగన్వాడీ కేంద్రాల సంఖ్య, డీఆర్డీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించి సమాచారం సేకరించారు.ప్రతి ప్రభుత్వ అధికారి తన బాధ్యతల నిర్వహణలో నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని ఆయన సూచించారు. అధికారులు తమ శాఖల పనితీరుకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర శాఖల కార్యక్రమాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి శాఖకు మరో శాఖతో అనుబంధం ఉండే పరిస్థితి ఉంటుందని, అన్ని శాఖల సమన్వయంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు .ఈ నేపథ్యంలో ప్రతి శాఖ అధికారి ఇతర శాఖలకు సంబంధించిన కనీసం ఐదు ముఖ్య అంశాలను నమోదు చేసుకోవాలని, అలాగే ఇతర శాఖల అభివృద్ధికి దోహదపడే రెండు సూచనలను కూడా నమోదు చేసి వాటి అమలుకు కృషి చేయాలని సూచించారు. ఈ విధంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తే రాబోయే ఏడాది కాలంలో జిల్లా అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.అధికారులు తమ సేవలోకి రాకముందు సాధారణ పౌరులుగా ఎదుర్కొన్న సమస్యలను గుర్తుచేసుకుని, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపే విధంగా పనిచేయాలని సూచించారు. ప్రతి అధికారి తన విధి నిర్వహణలో 70 శాతం సమయాన్ని కార్యాలయ పనులకు కేటాయిస్తూ, మిగిలిన 30 శాతం సమయాన్ని అభివృద్ధి కార్యక్రమాలపై ఆలోచించేందుకు వినియోగించాలని తెలిపారు. జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలని, తడి చెత్త – పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ప్రజా మరుగుదొడ్డి ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అలాగే రవాణా శాఖ పరిధిలో వాహనాలకు తగిన పార్కింగ్ సదుపాయాలు ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన ఇంటిని ఎలా శుభ్రంగా, సక్రమంగా నిర్వహిస్తాడో అదే విధంగా ప్రభుత్వ భవనాల నిర్వహణపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు. దీంతో భవనాల మరమ్మతుల ఖర్చులు తగ్గడంతో పాటు వాటి ఆయుష్షు పెరుగుతుందని తెలిపారు.జిల్లా జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ జనగణన లెక్కల ప్రకారం విద్యార్థులు, చిన్నపిల్లలు, కార్మికులు ఎంత శాతం ఉన్నారో పరిశీలించాలని, మిగిలిన వారు ఎక్కడ ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు అన్న విషయాలను గుర్తించి వారిని అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యం చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలో ఉన్న వ్యవసాయ భూములకు అనుగుణంగా చెరువులు, కాలువలు, ఫామ్ పాండ్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట కొత్త నీటి వనరుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి జిల్లా అధికారిని ఒక మండలానికి నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఆయా మండలాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా ఈ అధికారులు పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు వివరించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. పారిశుద్ధ్యం, గ్రామాభివృద్ధి, మౌలిక వసతులు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి పలు రంగాల్లో కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ శ్రీరామ్ తరణికాంతి, ఐఏఎస్ ను సన్మానించారు.ఈ ముఖాముఖి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ