తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు. ఆదివాసీ, పీవీటీజీ కుటుంబాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలి.గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రత్యేక జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలని, లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ సమగ్ర జీవనోపాధి కార్యక్రమం (టీఐఎల్పీ) మరియు తెలంగాణ సామాజిక అభ్యున్నతి కార్యక్రమం (టీఎస్డీపీ) అమలు పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఐడీఓసీ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన లబ్ధిదారులకు జీవనోపాధి అవకాశాల కల్పన, ఉత్పాదక ఆస్తుల పంపిణీ, గ్రామస్థాయిలో కార్యక్రమాల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల అమలులో జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టి లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు.లబ్ధిదారుల కుటుంబాలకు ఆధార్ నమోదు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు, రేషన్ కార్డులు, గృహాల మంజూరు, ఆరోగ్య సేవలు, టీకాల కార్యక్రమాలు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, అప్రోచ్ రోడ్లు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖలతో సమన్వయం పెంచి కుటుంబాలకు బహుళ జీవనోపాధి అవకాశాలు కల్పించాలని, పశువైద్య శిబిరాలు, పోషకాహార తోటలు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలని తెలిపారు. అలాగే అటవీ ఉత్పత్తుల ఆధారంగా ఇప్పపువ్వు, తేనె సేకరణ, తేనెటీగల పెంపకం, వెదురు సాగు వంటి కార్యక్రమాలను ప్రోత్సహించి ఆదివాసీ కుటుంబాల ఆదాయ వనరులను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ఆదివాసీ, పీవీటీజీ (అత్యంత వెనుకబడిన గిరిజన) కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేసి ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ సమగ్ర జీవనోపాధి కార్యక్రమం కింద గుండాల మండలంలో 800, దుమ్ముగూడెం మండలంలో 800, పినపాక మండలంలో 865, చర్ల మండలంలో 865 కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలు కల్పించడం, సంక్షేమ పథకాల అనుసంధానం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్డిఓ విద్యాచందన, ఏపీఎం వెంకయ్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ